సద్భావనలు - భగవత్శరణాగతి

చతుర్విధా భజంతే మాం  జనాః సుకృతినోఽర్జున!

ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ!! 7.16:

లోకంలో ప్రతి ఒక్కరూ ఎదో ఒక రీతిన పరమాత్మగురించి ఆలోచిస్తారు. వాళ్లలో 4 రకాల వారు ఉన్నారు  వారి గూర్చి పరమాత్మ ఇలా అంటున్నారు.

1) ఆర్తులు ( అనగా ఆపదల్లో/దుఖాల్లో ఉన్నవారు.)

కొంతమంది జనులు వారికి కష్టాలు ఎక్కువై పోయినప్పుడు లోకంలో ఎవరూ సహాయం చేయలేని పరిస్థితి వచ్చాక  భగవంతుడి గూర్చి పూజలు మొదలు పెడతారు. 

తీవ్రకష్టంలో ఎవరూ రక్షించలేకపోయినప్పుడు వారు రక్షణ కోసం భగవంతుడిని ఆశ్రయిస్తారు. దీనినే శరణాగతి అంటారు. 

శ్రీ కృష్ణుడికి ద్రౌపది చేసిన శరణాగతి ఇటువంటి కోవకు చెందిన శరణాగతియే.  

కౌరవ సభలో ద్రౌపది వివస్త్ర చేయబడుతున్నప్పుడు, ఆమె మొదట తన భర్తలు రక్షిస్తారనుకున్నది. వారు  ఏమీ చేయలేక నోరు మెడపక  ఉండిపోయారు

సభలో ఉన్న ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు విదురుడు వంటి  పెద్దల మీద కాపాడుతారని ఆశ పెట్టుకుని వారి వైపు చూసినా వారు కూడా  రక్షించలేకపోయారు.

ఈ స్థితిలో తన పళ్ళ మధ్యలో చీరను గట్టిగా పట్టుకుంది. 

ఈ స్థితి వరకు శ్రీ కృష్ణుడు ద్రౌపది రక్షణకు రాలేదు. చివరగా, దుశ్శాసనుడు ఆమె చీరను ఒక్కసారిగా లాగినపుడు అది ఆమె పంటి పట్టు నుండి జారి పోయింది. ఆ సమయంలోఆమెకు లోకంలోని మనుషుల మీద నమ్మకం పోయింది. తన సొంత బలం చాలదు. ఈ పరిస్థితి లో ఆమె సంపూర్ణముగా శ్రీ కృష్ణుడికి శరణాగతి చేసింది. వెనువెంటనే ఆయన సంపూర్ణ రక్షణ అందించాడు. 

ఆమె చీరను ఇంకా ఇంకా పొడుగు పెంచటం ద్వారా అడ్డుకున్నాడు. దుశ్శాసనుడు ఎంత గుంజినా, ద్రౌపదిని వివస్త్రను చేయలేక పోయాడు.

2) జిజ్ఞాసువులు.

కొంత మంది ఆధ్యాత్మికత గూర్చి దేవుడి గురించి తెలుసుకోవాలనుకునే ఉత్సుకతతో భగవంతుడిని ఆశ్రయిస్తారు.

వారు ముందుగా విన్న విషయాలను అనుసరిస్తారు. అనగా తిరుమలాది పుణ్యక్షేత్రాలలో అన్నమయ్య మొదలగు భక్తులు మోక్ష  పరమానందము సాధించారు కదా అని అదేంటో తెలుసుకోవాలని కుతూహలముతో ఉంటారు. ఆ ప్రయత్నం లో  వారు భగవంతుడిని ఆశ్రయిస్తారు.

3) అర్ధార్థి  (అనగా  లోకిక ప్రయోజనాలు  కోరేవారు)

వీరికి ఉన్న గొప్పతనం ఏమిటనగా భగవంతుడు మాత్రమే తమకు ఎఫైనా  ఇవ్వగలడని నమ్మకంతో వారు ఉంటారు  అందుకే పరమాత్మ ను ఆశ్రయిస్తారు. 

ఉదాహరణకి, ధృవుడు తన తండ్రి ఉత్తానపాదుని కంటే ఉన్నతుడు అవ్వాలనే కోరికతో తన భక్తిని ప్రారంభించాడు. కానీ, అతని భక్తి పరిపక్వమై, భగవంతుని దర్శనం అయినతరువాత, అమూల్యమైన దివ్య ప్రేమ వైఢూర్యాలు ఉన్నవాడి నుండి, తాను కోరుకున్నది, ఒక ముక్కలైన గాజు వక్కల వంటిది అని తెలుసుకున్నాడు. తదుపరి, భగవంతుడిని తనకు పవిత్రమైన నిస్వార్ధ భక్తిని ప్రసాదించమని కోరాడు.

4) జ్ఞానులు. 

అనగా జీవులమైన మేము భగవంతుని అణు-అంశలమని తమ సనాతనమైన శాశ్వతమైన కర్తవ్యం భగవంతుడిని ప్రేమించడం సేవించటమే  అన్న నిశ్చయానికి వచ్చినవారు.

వీరు నిష్కామ కర్మలతో జీవితం గడుపుతూ పరమాత్మకు అతి సమీపంగా ఉండే స్థితి పొందుతారు.

~ గంజాం రామకృష్ణ 

Comments